జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పేర్లు ఎత్తితే మీ వీపులు పగిలిపోతాయి: దేవినేని ఉమ తీవ్ర వ్యాఖ్యలు

టీడీపీపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని, ‘బురదగుంటలో పందిలా ఆ బురదను మాపై చల్లాలనే' ప్రయత్నాన్ని మానుకోవాలని వైసీపీ నేతలకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమ సూచించారు. మంగళగిరిలో ఇవాళ మీడియాతో ఆయన మాట్లాడారు. ఏపీ, తెలంగాణలో ఐటీ శాఖ దాడుల నేపథ్యంలో తమ నాయకులపై తప్పుడు కథనాలు రాశారంటూ ‘సాక్షి’పై మండిపడ్డారు.

జగన్ కు దమ్ముంటే ఐటీ శాఖ విడుదల చేసిన ప్రెస్ నోట్ ను తెలుగులోకి అనువదించి ‘సాక్షి’ పత్రికలో ప్రచురించాలని సవాల్ విసిరారు. జగన్ కు ఏమాత్రం దమ్మూధైర్యం ఉన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ కు సంబంధించిన ప్రతిమా ఇన్ ఫ్రా, పోలవరం ప్రాజెక్టు పనులు చేస్తున్న మెగా ఇన్ ఫ్రా, ఢిల్లీకి చెందిన షాపూర్ జీ-పల్లోంజీల గురించి ప్రస్తావించాలని ఛాలెంజ్ విసిరారు.

‘జగన్మోహన్ రెడ్డి గారు, ఈ పేర్లు ఎత్తితే మీ తోకలు కట్ అవుతాయి.. మీ వీపులు పగిలిపోతాయి’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ పేర్లను ప్రస్తావించకుండా చంద్రబాబుపై బురదజల్లాలని చూస్తారా? అంటూ ధ్వజమెత్తారు.

Devineni Uma
Telugudesam
Jagan
YSRCP
cm

More Telugu News